Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

19వ అధ్యాయము

1  అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి - మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారినడుగగా 
2  వారు - పరిశుద్ధాత్మ యున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. 
3  అప్పుడతడు - ఆలాగైతే మీరు దేనిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు - యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. 
4  అందుకు పౌలు - యోహాను తనవెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. 
5  వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. 
6  తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడను ప్రవచింపను మొదలుపెట్టిరి. 
7  వారందరు ఇంచుమించు పన్నెండుగురు పురుషులు. 
8  తరువాత అతడు సమాజమందిరములోకి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. 
9  అయితే కొందరు తమ హృదయములను కఠినపరచుకొని యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తూర్న అను ఒకని విద్యాశాలలో తర్కించుచు వచ్చెను. 
10  రెండేండ్ల పర్యంతము ఈలాగున జరిగెను గనుక యూదులేమి హెల్లేనీయులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి. 
11  మరియు దేవుడు పౌలుచేత విశేషమాన అద్భుతములను చేయించెను; 
12  అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లయినను రొగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దుష్టాత్మలు కూడ వదలిపోయెను. 
13  అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు - పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దుష్టాత్మలు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 
14  యూదుడైన స్కెవయను ఒక ప్రధానయజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. 
15  అందుకు ఆ దుష్టాత్మ - నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును గాని మీరెవరని అడుగగా 
16  ఆ దుష్టాత్మ పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి యింటనుండి పారిపోయిరి. 
17  ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును హెల్లేనీయులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. 
18  విశ్వసించినవారు అనేకులు వచ్చి, తమ చేష్టలను తెలియజేసి యొప్పుకొనిరి. 
19  మరియు మాంత్రికవిద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటివెల యేబదివేల వెండి రూకలాయెను. 
20  ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. 
21  ఈలాగు జరిగిన తరువాత పౌలు మకెదొనియ అకైయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేముకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి - నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను. 
22  అప్పుడు తనకు పరిచర్యచేయువారిలో తిమొథెయు ఎరస్తు అనువారినిద్దరిని మకెదొనియకు పంపి తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను. 
23  ఆ కాలమందు(క్రీస్తు) మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను. 
24  ఏలాగనగా -దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. 
25  అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి - అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును. 
26  అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియునున్నారు. 
27  మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహా దేవియైన అర్తెమిదేవియొక్క గడి గూడ తృణీకరింపబడి, ఆసియందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమెయొక్క మాహాత్మ్యము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. 
28  వారు విని రౌద్రముతో నిండినవారై ఎఫెసీయుల ఆర్తెమిదేవి మహాదేవి అనికేకలువేసిరి; 
29  పట్టణము బహుగలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మకెదొనియవారైన గాయియును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. 
30  పౌలు జనుల సభయొద్దకు వెళ్లదలచెను గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. 
31  మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి - నీవు నాటకశాలలోకి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. 
32  ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు. 
33  అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. 
34  అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు - ఎఫెసీయుల ఆర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి. 
35  అంతట కరణము సమూహమును సముదాయించి - ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము ఆర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని దాసియై యున్నదని తెలియనివాడెవడు? 
36  ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతముకలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము 
37  మీరు ఈ మనుష్యులను తీసికొని వచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. 
38  దేమేత్రికిని అతనితోకూడనున్న కంసాలులకును ఎవనిమీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. 
39  అయితే మీరు ఇతర సంగతులను గూర్చి యేమైనను విచారణ చేయవలెననియుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. 
40  మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన హేతువేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోకి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపుకూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. 
41  అతడీలాగు చెప్పి సభను ముగించెను. 
Download Audio File

No comments:

Post a Comment